IIT: వీకెండ్ కోసం ఎదురుచూసే ఉద్యోగాలు చేయకండి
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం అంటే కేవలం జీతం కోసం చేసే పనిగా మారిపోకూడదని, చేసే పనిలో ఆనందం వెతుక్కున్నప్పుడే వ్యక్తిగత అభివృద్ధి సాధ్యమని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి అభిప్రాయపడ్డారు.

- ఇష్టపడి చేసే పనే అసలైన విజయం
- యువతకు పిలుపునిచ్చిన ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి
సంగారెడ్డి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం అంటే కేవలం జీతం కోసం చేసే పనిగా మారిపోకూడదని, చేసే పనిలో ఆనందం వెతుక్కున్నప్పుడే వ్యక్తిగత అభివృద్ధి సాధ్యమని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి అభిప్రాయపడ్డారు. మీడియాతో జరిగిన చిట్ చాట్ లో ఆయన యువతకు, వృత్తి నిపుణులకు పలు కీలక సూచనలు చేశారు.
పనిలో ఒత్తిడి వద్దు.. ఉత్సాహం ఉండాలి
చాలామంది శనివారం, ఆదివారం ఎప్పుడు వస్తుందా అని కౌంట్ డౌన్ పెట్టుకుని పని చేస్తారని, అలాగే సోమవారం వస్తుందంటేనే ఒక రకమైన భయానికి లేదా బాధకు గురవుతుంటారని ఆయన పేర్కొన్నారు. అటువంటి వాతావరణంలో చేసే ఉద్యోగం వల్ల మానసిక ప్రశాంతత లభించదని ఆయన స్పష్టం చేశారు.
రంగం ఏదైనా.. ఇష్టం ముఖ్యం
యువత తమ కెరీర్ ను ఎంచుకునేటప్పుడు ఇతరుల ఒత్తిడితో కాకుండా, తమకు ఏ రంగంపై ఆసక్తి ఉందో దానిని ఎంచుకోవాలని ఆయన సూచించారు. మీరు ఏ పనిని అయితే పూర్తిగా ఆస్వాదించగలరో, ఆ రంగంలోనే స్థిరపడండి. వృత్తిని ప్రేమిస్తే అది పనిలా అనిపించదు, ఒక సృజనాత్మక ప్రక్రియలా సాగుతుంది. ఇష్టపడే రంగంలో సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించే శక్తి లభిస్తుంది. వృత్తి పట్ల ఇష్టాన్ని పెంచుకున్నప్పుడే అద్భుతమైన ఫలితాలు సాధించగలమని, అప్పుడే సమాజానికి కూడా మేలు జరుగుతుందని ప్రొఫెసర్ మూర్తి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ స్ఫూర్తిదాయక మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో, విద్యా వర్గాల్లో వైరల్ అవుతున్నాయి.



