Sangareddy Municipality: సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ. 31.70 కోట్లతో అభివృద్ధి పనులు.. శంకుస్థాపన చేసిన టీజిఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో రూ. 31.70 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు టీజిఐఐసి (TGIIC) చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి శ్రీకారం చుట్టారు.

సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో రూ. 31.70 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు టీజిఐఐసి (TGIIC) చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి శ్రీకారం చుట్టారు. బుధవారం మున్సిపాలిటీలోని 13 వార్డుల్లో పర్యటించిన ఆమె, స్థానిక నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా శంకుస్థాపనలు చేశారు.
ఈ నిధులను HMDA, UIDF ద్వారా కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా వివిధ వార్డుల్లో సిసి రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడంతో పాటు పట్టణ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా రూ. 3 కోట్ల వ్యయంతో రాజీవ్ పార్క్ సుందరీకరణ పనులకు, అలాగే రూ. 2 కోట్ల వ్యయంతో రాజంపేట నుండి ఈద్గా వరకు నిర్మించనున్న ఫిల్టర్ బెడ్ రోడ్డు పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోంగుల రవి, అశోక్ రెడ్డి, కూన సంతోష్, షఫీ హఫీజ్, కిరణ్ గౌడ్, మహేష్, శ్రీకాంత్ గౌడ్, ఆయా వార్డుల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



