బీరంగూడ గుట్టపై అక్రమణలు వెంటనే తొలగించండి: అధికారులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ఆదేశం
బీరంగూడలోని ప్రసిద్ధ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం సమీక్ష నిర్వహించారు

బీరంగూడలోని ప్రసిద్ధ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 14 నుండి 18 వరకు జరిగే ఈ వేడుకలకు సుమారు 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, సామాన్య భక్తులకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. దేవాలయ ఆవరణలో ఉన్న కబ్జాలను 24 గంటల్లోగా తొలగించాలని రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించారు.
-
సమన్వయం: ఐదు రోజుల పాటు అన్ని శాఖలు కలిసి పనిచేయాలని, భక్తుల కోసం ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
-
భద్రత: నిఘా కోసం 50 సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని, రద్దీ నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వాడాలని పోలీసులకు తెలిపారు.
-
సౌకర్యాలు: భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని, వీఐపీల పేరుతో సామాన్యులకు ఇబ్బంది కలిగించవద్దని స్పష్టం చేశారు. ఏర్పాట్లపై తుది సమీక్షను ఈ నెల 12న మరోసారి నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.



