CDR: మహిళల ఆరోగ్య రక్షణకు భారీ కార్యాచరణ.. 46 లక్షల మందికి వైద్య పరీక్షలు
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన సుమారు 46 లక్షల మంది మహిళల హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన సుమారు 46 లక్షల మంది మహిళల హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన ప్రారంభించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. టీ డయాగ్నస్టిక్స్ ద్వారా ఒక్కో మహిళకు 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారి పూర్తి ఆరోగ్య వివరాలను నమోదు చేస్తారు. ఈ స్క్రీనింగ్ ప్రక్రియను మూడు దశల్లో చేపట్టి, ఆరు నెలల లోపు పూర్తి చేయాలని మంత్రి లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనికోసం తొలుత ప్రతి జిల్లాలో 5 మండలాల చొప్పున ఎంపిక చేసి కార్యక్రమాన్ని మొదలుపెడతారు.
బుధవారం సెక్రటేరియట్లో నిర్వహించిన సమీక్షలో మంత్రి 99 రోజుల ప్రత్యేక ప్రణాళికను వెల్లడించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నాలుగు దశల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మొదటి దశలో మాతా శిశు సంరక్షణ, రక్తహీనత నివారణపై దృష్టి సారిస్తారు. రెండో దశలో బీపీ, షుగర్ వంటి వ్యాధుల గుర్తింపునకు సబ్ సెంటర్ల వారీగా క్యాంపులు నిర్వహిస్తారు. మూడో దశలో టీబీ నియంత్రణ ఎండాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. చివరి దశలో పట్టణ ప్రాంతాల్లోని 145 అర్బన్ పీహెచ్సీలను పాలిక్లినిక్స్గా అప్గ్రేడ్ చేసి స్పెషాలిటీ వైద్య సేవలను పేదలకు చేరువ చేయనున్నారు.



