BRS: కేటీఆర్, హరీశ్ రావులపై కుట్రపూరితంగానే సిట్ నోటీసులు.. మాజీ ఛైర్మన్ మఠం బిక్షపతి ధ్వజం
ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులను రాజకీయంగా దెబ్బతీయడానికే రేవంత్ సర్కార్ సిట్ (SIT) నోటీసులు జారీ చేస్తోందని మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ మఠం బిక్షపతి తీవ్రంగా విమర్శించారు.

హైదరాబాద్: ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులను రాజకీయంగా దెబ్బతీయడానికే రేవంత్ సర్కార్ సిట్ (SIT) నోటీసులు జారీ చేస్తోందని మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ మఠం బిక్షపతి తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
డైవర్షన్ పాలిటిక్స్: సుజన్ రెడ్డి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం బయటపడటంతో, ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ఈ ‘డైవర్షన్ పాలిటిక్స్’కు తెరలేపారని మండిపడ్డారు.
న్యాయస్థానాల తీర్పులకు విరుద్ధం: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని తెలిసినా, సాక్షాత్తూ సుప్రీంకోర్టు తీర్పులను బేఖాతరు చేస్తూ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని పేర్కొన్నారు. హరీశ్ రావుకు నోటీసు ఇచ్చిన 24 గంటలు గడవకముందే కేటీఆర్కు నోటీసు ఇవ్వడం చూస్తుంటే ఇది ముందస్తు ప్లాన్ అని అర్థమవుతోందన్నారు.
ప్రతికార పాలన: ప్రజలు సుపరిపాలన కోసం ఓటేస్తే, రేవంత్ రెడ్డి మాత్రం ప్రతికార పాలనకు ప్రాధాన్యత ఇస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలోనూ, క్షేత్రస్థాయిలోనూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న కేటీఆర్ చొరవను చూసి కాంగ్రెస్కు భవిష్యత్తు లేదని భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.
విచారణకు సిద్ధం: “మాకు చట్టం, న్యాయస్థానాల పట్ల పూర్తి గౌరవం ఉంది. ఏ విచారణకైనా మేము సిద్ధం. కానీ అక్రమ కేసులతో ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తే అది మీ భ్రమ మాత్రమే” అని హెచ్చరించారు.
ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులకు గురిచేసినా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం ఆగదని, అడుగడుగునా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని మఠం బిక్షపతి స్పష్టం చేశారు.
