భారతదేశ వరి దిగుబడిని కాపాడటానికి రైతులు తప్పనిసరిగా..

- రాజవేలు ఎన్కే, సీఈఓ, క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్, గోద్రెజ్ ఆగ్రోవెట్
ఆంధ్రప్రదేశ్లోని వరి రైతులు మారుతున్న వాతావరణం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రధాన పంటకు ఎదురవుతున్న చీడపీడల ముప్పును ఎదుర్కోవడానికి కొత్త తరం పంట రక్షణ పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా ఆకు ముడత మరియు కాండం తొలిచే పురుగుల ఉధృతి ప్రస్తుతం పెరుగుతోంది. వరి పంటను నాశనం చేసే ప్రధాన శత్రువులలో ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి పంట ఎదుగుదల దశలో మరియు మధ్య దశలో దాడి చేయడం వల్ల దిగుబడిలో వరుసగా 30 శాతం మరియు 40 శాతం వరకు నష్టం కలిగే అవకాశం ఉంది. దీని వల్ల రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏ పంటకైనా ఇంత పెద్ద మొత్తంలో నష్టాలు కలగడం అనేది రైతుపై మోయలేని భారాన్ని మోపుతుంది. అయితే వరి విషయానికి వస్తే ఈ నష్టాల ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఇది దేశ ఆహార భద్రత నుండి రైతుల ఆదాయాల వరకు అన్నింటినీ ప్రభావితం చేస్తుంది.
భారత దేశానికి మరియు ప్రపంచానికి బియ్యం అత్యంత ముఖ్యమైన ప్రధాన ఆహారం. మన దేశ జనాభాలో దాదాపు మూడింట రెండు వంతుల మంది తమ రోజువారీ ఆహార అవసరాల కోసం బియ్యంపైనే ఆధారపడుతున్నారు.
ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలకు కూడా ఇదే ప్రధాన ఆహారం కావడంతో ప్రపంచ ఆహార భద్రతలో వరి ఒక కీలకమైన పంటగా మారింది. ఈ వస్తువు ఉత్పత్తి మరియు ఎగుమతుల్లో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఉంది. కాబట్టి మన దేశ ప్రజలతో పాటు ప్రపంచం ఆకలిని తీర్చాల్సిన బాధ్యత భారతీయ రైతులపై ఉంది.
ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలోని మొత్తం సాగు భూమిలో దాదాపు 90 శాతం వరి పంట కింద ఉండటం, ప్రధాన పంటగా దాని ఆధిపత్యాన్ని తెలియజేస్తోంది. మరోవైపు సుమారు 62 శాతం జనాభా తమ జీవనోపాధి కోసం వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడుతుండగా, అందులో అత్యధిక భాగం వరి సాగుతోనే ముడిపడి ఉంది.
అందువల్ల రాష్ట్రంలోని వరి పంటను కాండం తొలిచే పురుగు మరియు ఆకు ముడత వంటి చీడపీడల నుండి రక్షించడం మరియు తద్వారా దిగుబడిని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఈ తెగుళ్లను గుర్తించడం చాలా కష్టమైన పని కాబట్టి, వాటిని రాకుండా అడ్డుకోవడమే వీటికి వ్యతిరేకంగా ఉన్న అతిపెద్ద గ్యారెంటీ.
నేటి రైతులకు పర్యావరణం, నేల మరియు మానవ ఆరోగ్యంపై కనిష్ట ప్రభావం చూపుతూనే, చీడపీడలపై సమర్థవంతంగా పనిచేసే అధునాతన పంట రక్షణ పరిష్కారాలు అవసరం. ఇటువంటి పరిష్కారాల ద్వారా లభించే దిగుబడి పెరుగుదల, భారతదేశ వరి దిగుబడి అంతరాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
అటువంటి పంట రక్షణ పరిష్కారాలు అందించే దిగుబడి పెరుగుదల, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశపు వరి దిగుబడి అంతరాన్ని తగ్గిస్తుంది.
భారతీయ వ్యవసాయ రంగంలో వరి సాగు అనేది ఒక అతిపెద్ద విజయగాథ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఉత్పత్తి పరంగా గణనీయమైన సంఖ్యలను సాధిస్తున్నప్పటికీ, హెక్టారుకు వచ్చే దిగుబడిలో మాత్రం భారతదేశం తోటి దేశాల కంటే వెనుకబడి ఉంది.
యు.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) అంచనా ప్రకారం, 2025-26లో భారతదేశపు సగటు వరి దిగుబడి హెక్టారుకు 4 వేల 390 కిలోలకు చేరుకోవచ్చు. కానీ ఇది మన పొరుగు దేశమైన చైనా సాధిస్తున్న సగటు వరి దిగుబడి అయిన సుమారు 7,100 కిలోల కంటే చాలా తక్కువగా ఉంది.
దిగుబడిని పెంచడం వల్ల వరి ఉత్పత్తికి మించిన ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎకరాకు ఉత్పాదకత పెరగడం వల్ల మిగిలిన భూమిని ఇతర రకాల పంటల సాగుకు ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో ఈ విధానం మరింత స్థిరమైన పంటల సాగు పద్ధతుల వైపు మొగ్గు చూపడానికి సహాయపడుతుంది.
మరో ప్రోత్సాహకరమైన విషయం ఏమిటంటే ఆధునిక పంట రక్షణ పద్ధతుల ఆవశ్యకతపై రైతులు ఇప్పుడు మరింత అవగాహన పెంచుకుంటున్నారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 77 శాతం మంది రైతులు చీడపీడలను త్వరగా నియంత్రించడంతో పాటు దీర్ఘకాలిక రక్షణ మరియు పంట ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పరిష్కారాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
పరిశోధన మరియు ఆవిష్కరణలు ఇక్కడే తమ దృష్టిని కేంద్రీకరించాలి. పంట రక్షణ పరిష్కారాలు కేవలం చీడపీడలను నిర్మూలించడమే కాకుండా, దిగుబడి ఏర్పడే ప్రక్రియను కాపాడే విధంగా రైతు కేంద్రితంగా ఉండాలి. అంతిమంగా వరి దిగుబడిని రక్షించడం అనేది కేవలం వ్యవసాయ స్థితిస్థాపకత గురించి మాత్రమే కాదు, అది దేశ పటిష్టతను పెంపొందించడం కూడా అవుతుంది.

