భారత పౌర అణుశక్తి ప్రస్థానంలో సరికొత్త చరిత్ర.. తొలి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ నిర్మాణంలో గోద్రెజ్ కీలక భాగస్వామ్యం
భారత అణుశక్తి రంగం ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. కల్పక్కంలోని ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) విజయవంతంగా క్రిటికాలిటీని సాధించడంతో దేశం తన మూడంచెల అణుశక్తి ప్రణాళికలో రెండో దశలోకి అధికారికంగా అడుగుపెట్టింది

హైదరాబాద్: భారత అణుశక్తి రంగం ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. కల్పక్కంలోని ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) విజయవంతంగా క్రిటికాలిటీని సాధించడంతో దేశం తన మూడంచెల అణుశక్తి ప్రణాళికలో రెండో దశలోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్కు చెందిన ప్రిసిషన్ ఇంజనీరింగ్ విభాగం అత్యంత కీలకమైన భాగాలను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి అందించి దేశ ఇంధన స్వయంప్రతిపత్తిలో తన వంతు పాత్ర పోషించింది.
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారతీయ నాభికియా విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (భవిని) కోసం గోద్రెజ్ సంస్థ లార్జ్ రొటేటింగ్ ప్లగ్ (LRP) స్మాల్ రొటేటింగ్ ప్లగ్ (SRP) సోడియం పంప్ షాఫ్ట్ వంటి సంక్లిష్టమైన పరికరాలను రూపొందించింది. ఎనిమిది మీటర్ల వ్యాసం కలిగి సుమారు 120 టన్నుల బరువుండే ఈ రొటేటింగ్ ప్లగ్లు రియాక్టర్ కోర్లోకి ఇంధనాన్ని పంపేటప్పుడు 360 డిగ్రీల కోణంలో అత్యంత ఖచ్చితత్వంతో తిరగాల్సి ఉంటుంది. అలాగే 10 మీటర్ల పొడవు ఉండే సోడియం పంప్ షాఫ్ట్ నిమిషానికి 500 కంటే ఎక్కువ సార్లు (RPM) ద్రవ సోడియం వాతావరణంలో తిరుగుతూ రియాక్టర్ పనితీరును నియంత్రిస్తుంది.
గతంలో ఇలాంటి పరికరాలను తయారు చేసిన అనుభవం దేశంలో ఎవరికీ లేకపోయినప్పటికీ గోద్రెజ్ ఇంజనీర్లు వినూత్నమైన బేరింగ్ వ్యవస్థలు ఘర్షణను తట్టుకునే ఉపరితల చికిత్స ప్రక్రియలను అభివృద్ధి చేసి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం విశేషం. భూకంపాలు వంటి విపత్కర పరిస్థితులను కూడా తట్టుకునేలా ఈ వ్యవస్థలను రూపొందించారు. 22 ఏళ్ల నిరంతర శ్రమతో సాధించిన ఈ క్రిటికాలిటీ భారత ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది.
ప్రస్తుతం భారత్ వద్ద 846,000 టన్నుల థోరియం నిల్వలు ఉన్నాయి. సాధారణ రియాక్టర్ల కంటే ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు తక్కువ ఇంధనాన్ని వాడుకుంటూ ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయడమే కాకుండా మరిన్ని ఇంధన వనరులను సృష్టిస్తాయి. ఇది భవిష్యత్తులో దేశానికి తక్కువ ఖర్చుతో కూడిన కార్బన్ రహిత సుస్థిర విద్యుత్ శక్తిని అందించడానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ మైలురాయి ద్వారా వ్యూహాత్మక రంగాలలో భారత్ యొక్క స్వదేశీ తయారీ సామర్థ్యం మరోసారి ప్రపంచానికి చాటిచెప్పబడింది.



