బిజినెస్

100 ఏళ్ల బజాజ్.. దేశ నిర్మాణంలో శతాబ్దపు ప్రస్థానాన్ని కొనియాడిన ప్రధాని నరేంద్ర మోదీ 

  • మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 148 బిలియన్ యూఎస్ డాలర్ల విలువతో భారతదేశ అతిపెద్ద సమూహాలలో ఒకటిగా ఉన్న బజాజ్ గ్రూప్, ఆటోమొబైల్స్, ఆర్థిక సేవలు, కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్, ఇంజినీరింగ్ రంగాల ద్వారా ప్రతి ముగ్గురు భారతీయులలో ఒకరికి సేవలు అందిస్తోంది.
  • బజాజ్ గ్రూప్ ప్రస్థానం దాని ఫౌండర్ జమ్నాలాల్ బజాజ్ నుండి మొదలైంది. స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక సంస్కర్త, గొప్ప దాత, పారిశ్రామికవేత్త అయిన ఆయనను మహాత్మా గాంధీ తన ఐదవ కుమారుడిగా (దత్తపుత్రుడు) భావించేవారు. ఆయన 1926లో ముంబై (అప్పటి బాంబే)లో ఈ గ్రూప్ మొట్టమొదటి కార్యాలయాన్ని స్థాపించారు.

ముంబై: భారతదేశపు అత్యంత పురాతన వ్యాపార సంస్థలలో ఒకటిగా, 148 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో అతిపెద్ద గ్రూపులలో ఒకటిగా ఉన్న బజాజ్ గ్రూప్, నేడు 100 ఏళ్ల వ్యాపార ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. భారత స్వాతంత్ర్య ఉద్యమం నుండి నేటి ఆర్థికాభివృద్ధి వరకు దేశ గమనంతో ముడిపడి ఉన్న ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక సంస్కర్త, పరోపకారి మరియు పారిశ్రామికవేత్త అయిన జమ్నాలాల్ బజాజ్ 1926లో ముంబైలో ఈ గ్రూప్‌ను స్థాపించారు. మహాత్మా గాంధీ ఐదవ దత్తపుత్రుడిగా పేరుగాంచిన ఆయన వేసిన పునాదులతో, నేడు బజాజ్ గ్రూప్ దేశంలోని ప్రతి మూడు కుటుంబాలలో ఒకరికి సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 1,30,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

100 కంటే ఎక్కువ కంపెనీలు, 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతులు మరియు త్వరలో ఆరోగ్య సంరక్షణ (healthcare) రంగంలోకి అడుగుపెట్టబోతున్న బజాజ్ గ్రూప్, ఆటోమొబైల్స్, ఆర్థిక సేవలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇంజినీరింగ్ రంగాలలో భారత అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్ మరియు ముకంద్ వంటివి ఈ గ్రూపులోని కొన్ని లిస్టెడ్ కంపెనీలు.

దేశ నిర్మాణంలో బజాజ్ గ్రూప్ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ, బజాజ్ కుటుంబానికి పంపిన సందేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు, “బజాజ్ గ్రూప్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, ఈ మైలురాయితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ నేను నా అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏ సంస్థకైనా వందేళ్ల ప్రయాణం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది కేవలం ఆ సంస్థ దీర్ఘకాలిక ఉనికిని మాత్రమే కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతూ, తరతరాల పాటు తన ప్రాముఖ్యతను కాపాడుకునే సామర్థ్యాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.

జమ్నాలాల్ బజాజ్ నాయకత్వంలో ప్రారంభమైన బజాజ్ గ్రూప్, మన దేశ అభివృద్ధిలోని అనేక దశలలో భారతదేశ పారిశ్రామిక మరియు ఆర్థిక రంగంలో ఒక భాగంగా ఉంది. ఇది వివిధ రంగాలలో కార్యకలాపాలు సాగిస్తూ, భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సేవలు అందించే ఒక వైవిధ్యభరితమైన కంపెనీగా ఎదిగింది.

గడిచిన దశాబ్దాలుగా ఉద్యోగ అవకాశాలను కల్పించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు సామాజిక అభివృద్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా దేశ నిర్మాణంలో బజాజ్ గ్రూప్ ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇలాంటి మైలురాళ్లు గతంలో అందించిన కీలక సహకారాలను గుర్తు చేసుకోవడానికి, అలాగే వృద్ధి, సుస్థిరత, అందరినీ కలుపుకునిపోయే పురోగతి పట్ల నిబద్ధతను పునరుద్ధరించుకోవడానికి ఒక గొప్ప అవకాశం.

తయారీ రంగం, ఆవిష్కరణలు, ప్రపంచ స్థాయి పోటీతత్వంలో భారత్ నూతన ఆకాంక్షలతో ముందుకు సాగుతోంది. బజాజ్ గ్రూప్ వంటి లోతైన మూలాలు, అనుభవం ఉన్న సంస్థలు 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించాల్సి ఉంది.

ఈ చిరస్మరణీయ సందర్భంలో బజాజ్ గ్రూప్‌లోని ప్రతి ఒక్కరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రాబోయే కాలంలో కూడా దేశాభివృద్ధిలో ఈ సంస్థ నిరంతర పురోగతిని మరియు అర్థవంతమైన సహకారాన్ని అందిస్తుందని నేను విశ్వసిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన, శిశు ఆరోగ్యం, విద్య, రక్షణపై దృష్టి సారించిన బజాజ్ గ్రూప్ సామాజిక సేవా కార్యక్రమాలు (CSR), ఇప్పటివరకు 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది లబ్ధిదారుల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపాయి.

ముంబైలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఈ శతాబ్ది వేడుకల్లో బజాజ్ కుటుంబ సభ్యులు, పారిశ్రామిక దిగ్గజాలు, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు మరియు వ్యాపార భాగస్వాములు పాల్గొన్నారు. ఈ సాయంత్రం వేళ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆ కుటుంబం పోషించిన పాత్ర నుండి, వర్తక వ్యాపారం నుండి తయారీ మరియు ఆర్థిక సేవల రంగం వైపు సాగిన మార్పు వరకు, అలాగే నేడు వారి వ్యాపారాలు ముందుండి నడిపిస్తున్న సరికొత్త సాంకేతికత వరకు సాగిన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రదర్శించారు.

ఈ కార్యక్రమం ముఖ్యాంశాలలో బజాజ్ కుటుంబ సభ్యుల ప్రసంగాలు, గ్రామీ అవార్డు గ్రహీత మరియు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపోజర్ రికీ కేజ్(Ricky Kej) మరియు ఆయన బృందం ప్రత్యేకంగా రూపొందించిన లైవ్ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు జమ్నాలాల్ బజాజ్ మరియు మహాత్మా గాంధీపై రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ‘కథ్నీ కర్నీ ఏక్సీ’ (Kathni Karni Eksi) అనే చిత్రాన్ని ప్రదర్శించారు. ‘100 ఇయర్స్ ఆఫ్ బజాజ్’ లోగోను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో:

బజాజ్ ఆటో, ఛైర్మన్, నీరజ్ బజాజ్ ‘ఇండియా అండ్ బజాజ్’ అనే అంశంపై ప్రసంగిస్తూ ఇలా అన్నారు:

“మా కుటుంబం తరపున గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన మాటలు మాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. నిజానికి బజాజ్ చరిత్ర, భారతదేశ చరిత్ర ఎప్పుడూ విడివిడిగా లేవు. స్వయం సమృద్ధి అనేది మన దేశంలో ఇప్పుడే మొదలవ్వలేదు. దాదాపు వందేళ్ల క్రితమే భారత్ తన వస్తువులను తానే తయారు చేసుకోవాలని, తన కాళ్ల మీద తాను నిలబడాలని అప్పటి దార్శనికులు కలలు కన్నారు. వారిలో మా సంస్థ ఫౌండర్ జమ్నాలాల్‌జీ ఒకరు. సొంత లాభం కంటే అందరి మేలే ముఖ్యం అనే ఆయన ఆలోచన విధానమే తరతరాలుగా మా నిర్ణయాలకు పునాది. ఆయన భార్య జానకీదేవి బజాజ్ పద్మ విభూషణ్ అవార్డు పొందిన దేశ మొట్టమొదటి మహిళ. జమ్నాలాల్‌జీ కుమారులు కమల్ నయన్ బజాజ్, రామకృష్ణ బజాజ్‌లు మహాత్మా గాంధీ పర్యవేక్షణలోనే పెరిగి ఆ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత రాహుల్ బజాజ్ మంచి ఫలితాలను ఇస్తూనే, మానవత్వం, నిజాయితీ కలిగిన ఒక గొప్ప సంస్థను నిర్మించారు. పరిశ్రమలు ఎంత ఎదిగినా మా లక్ష్యం మాత్రం ఎప్పుడూ ఒకటే.. అది భారతదేశంలోనే తయారు చేయాలి, భారతీయుల కోసమే తయారు చేయాలి మరియు భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి.” అని పేర్కొన్నారు.

బజాజ్ ఆటో, మేనేజింగ్ డైరెక్టర్, రాజీవ్ బజాజ్ ‘గ్లోబలైజేషన్’ అనే అంశంపై ప్రసంగిస్తూ ఇలా అన్నారు:

“మనం చెప్పేదానికి, చేసేదానికి ఎప్పుడూ పొంతన ఉండాలి. బహుశా అందుకే బజాజ్ ప్రస్థానం కేవలం ఎదుగుదలకే పరిమితం కాలేదు, అదొక నమ్మకానికి చిహ్నంగా మారింది. ఈ రోజు బజాజ్ ఆటో కేవలం భారతదేశంలోని అతిపెద్ద టూ వీలర్ కంపెనీలలో ఒకటి మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా టాప్ 3 కంపెనీలలో ఒకటిగా నిలిచింది. ఆఫ్రికా, లాటిన్ అమెరికా మరియు ఆగ్నేయ ఆసియాలోని 100 కంటే ఎక్కువ దేశాలలో మా వాహనాలు అమ్ముడవుతున్నాయి. ఈ రోజు పల్సర్ బ్రాండ్ ప్రపంచ స్థాయి పోటీదారులతో సమానంగా నిలబడుతోంది. అలాగే ఆస్ట్రియాకు చెందిన ప్రఖ్యాత మోటార్ సైకిల్ కంపెనీ కేటీఎం(KTM) తో మేము జతకట్టడం అనేది కేవలం ఒక వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు. ఒక భారతీయ కంపెనీ ఎవరినో అనుసరించేది మాత్రమే కాదు, ప్రపంచ స్థాయి బ్రాండ్లను సృష్టించగల సామర్థ్యం కలదని ఇది నిరూపించింది. వారసత్వం మరియు కొత్త ఆలోచనలు (ఇన్నోవేషన్) కలిసి సాగగలవని ఇది చాటిచెప్పింది. నేటి భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కేవలం భాగస్వామిగా మాత్రమే లేదు, గట్టి పోటీనిచ్చే శక్తిగా ఎదిగింది”అని పేర్కొన్నారు.

బజాజ్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిస్టమ్, సీఈఓ, నీరవ్ బజాజ్ ‘సమ్మిళిత అభివృద్ధి’ (Inclusive Development) అనే అంశంపై ప్రసంగిస్తూ ఇలా అన్నారు:

“వ్యాపారం అనేది సమాజం నుండి వేరుగా ఉండకూడదని జమ్నాలాల్‌జీ నమ్మారు. పేదలకు ప్రయోజనం చేకూర్చే విధంగానే వ్యాపారం సాగాలని ఆయన చెప్పారు. వ్యాపార లాభాల ద్వారా సమాజం కూడా లాభపడాలని మా కుటుంబంలో మేం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. అంటే, అభివృద్ధి అనేది అట్టడుగున ఉన్న పేదవారికి కూడా అందాలని దీని అర్థం. మా సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమం ‘బజాజ్ బియాండ్’ (Bajaj Beyond) అనేది మా వందేళ్ల సిద్ధాంతానికి నిదర్శనం. మేం నేర్చుకున్న అనుభవాలను ఉపయోగించి దేశవ్యాప్తంగా అమలు చేయగల నమూనాలను రూపొందించడమే మా ప్రయత్నం. విద్య, ఉపాధి, సుస్థిరత వంటి రంగాల ద్వారా రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల మంది భారతీయ యువతకు సాధికారత కల్పించడమే మా లక్ష్యం. గత 100 ఏళ్లు గొప్ప సంస్థలను నిర్మించడంపై దృష్టి పెడితే, రాబోయే 100 ఏళ్లు అందరికీ ఉపయోగపడే వ్యవస్థలను (ecosystems) నిర్మించడం గురించి ఉంటుంది”అని పేర్కొన్నారు.

బజాజ్ ఫిన్‌సర్వ్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, సంజీవ్ బజాజ్ ‘India and the Next 100’ అనే అంశంపై ప్రసంగిస్తూ ఇలా అన్నారు:

“మా తండ్రి రాహుల్ బజాజ్ తరచూ ఒక మాట చెప్పేవారు – ‘Idea of India మీద, మన దేశంలోని వైవిధ్యం మీద మరియు ఇక్కడి చురుకైన యువత మీద నాకు గట్టి నమ్మకం ఉంది’ అని. భారతదేశ అభివృద్ధి తదుపరి అధ్యాయం సాంకేతికత, ఆవిష్కరణలు మరియు ముఖ్యంగా యువత ద్వారానే లిఖించబడుతుంది. బజాజ్ సంస్థలో మేము ఏఐని(AI) కేవలం ఒక టెక్నాలజీ ట్రెండ్‌లా చూడటం లేదు. ఆర్థిక సేవలు అందరికీ చేరవేయడంలో (financial inclusion) ఇదొక శక్తివంతమైన సాధనమని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆర్థిక సేవలు అందడం అంటేనే అవకాశాలు దొరకడం అని అర్థం. గడిచిన శతాబ్ద కాలంగా మేం మా వ్యాపారాలను ఒకే కోణంలో చూస్తున్నాం. అవి కేవలం లాభాల కోసం మాత్రమే కాకుండా ఆశను, స్వేచ్ఛను మరియు వ్యాపార దృక్పథాన్ని కల్పించే వేదికలుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఒకరిలోని ప్రతిభకు సరైన వేదిక దొరికితే, దేశం మొత్తం ముందుకు సాగుతుందని మేము నమ్ముతున్నాం”అని పేర్కొన్నారు.

బజాజ్ ఎలక్ట్రికల్స్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ బజాజ్.. జమ్నాలాల్ బజాజ్ పాటించిన విలువలు మరియు ఆయన సృష్టించిన సామాజిక ప్రభావం గురించి ప్రసంగిస్తూ ఇలా అన్నారు:

“సామాజిక సమానత్వం, మహిళలు, పిల్లలకు విద్య, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఖాదీ ప్రచారం వంటి రంగాలలో జమ్నాలాల్‌జీ ఎంతో కృషి చేశారు. అలాగే ముసుగు పద్ధతి (purdah), వరకట్నం, బాల్య వివాహాల నిర్మూలన కోసం పోరాడటమే కాకుండా స్వాతంత్ర్య ఉద్యమంలో పూర్తిస్థాయిలో పాల్గొన్నారు. విజయం అంటే కేవలం సంఖ్యలు లేదా వ్యాపార విస్తరణేనా? లేక ఎంతమంది జీవితాలను ప్రభావితం చేశాం, ఎటువంటి విలువలను కాపాడాం, సమాజాన్ని ఎంతలా బలోపేతం చేశాం అన్నదా? బజాజ్ గ్రూప్ తదుపరి 100 ఏళ్ల ప్రయాణంలోకి అడుగుపెడుతున్న వేళ, ఈ ప్రశ్నకు మనం ఇచ్చే సమాధానమే మనం నిర్మించబోయే సంస్థ భవిష్యత్తును నిర్ణయిస్తుంది” అని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *