Andole Industrial Development: అందోల్లో పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పిస్తాం: మంత్రి దామోదర కీలక ప్రకటన!
అందోల్ - జోగిపేట ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక మహిళలు, యువత జీవితాల్లో వెలుగులు నింపుతామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

అందోల్: అందోల్ – జోగిపేట ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక మహిళలు, యువత జీవితాల్లో వెలుగులు నింపుతామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఇందుకోసం పలు పరిశ్రమలను పరిశీలిస్తున్నామని చెప్పారు. మండల కేంద్రమైన అందోల్, సంగుపేట పరిధిలో పరిశ్రమలకు అనువైన స్థలాలు వెతుకుతున్నామని చెప్పారు. మంగళవారం జోగిపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో అందోల్ – జోగిపేట పట్టణ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
మహిళా సంఘాల బలోపేతానికి నిధులు
మహిళా సంఘాల సమావేశాల కోసం, మౌలిక వసతుల కల్పన కోసం అందోల్, జోగిపేటల్లో ప్రత్యేక భవనాలను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.4 కోట్లను మంజూరు చేయనుందని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సుమారు 327 మహిళా సంఘాలకు చెందిన 3,400 మంది సభ్యులు పాల్గొని రుణాలను అందుకున్నారు.
చారిత్రక నేపథ్యం, ప్రస్తుత పథకాలు
మహిళా సంఘాల ఉద్యమానికి పునాది వేసిన దివంగత నేత డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన హయాంలో ప్రారంభమైన పావలా వడ్డీ పథకాన్ని ప్రస్తుతం తమ ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పథకంగా అమలు చేస్తోందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.40 వేల కోట్ల రుణాలకు సంబంధించిన వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అందోల్ – జోగిపేట మున్సిపాలిటీకి సంబంధించి రూ. 74.26 లక్షల వడ్డీ లేని రుణాలను సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ పాండు, పీడీ మెప్మా రామాచారి, మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు, మున్సిపల్ కమిషనర్ రవీందర్, పలువురు ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అందోల్లో స్థలం..
మహిళా సంక్షేమంతో పాటు ప్రాంతీయ అభివృద్ధిపై మంత్రి పలు హామీలిచ్చారు. పార్టీలకు అతీతంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అందోల్లో 5 ఎకరాల భూమిని ప్లాట్లుగా పంపిణీ చేసే ఆలోచన ఉందని చెప్పారు. నాణ్యమైన చీరల పంపిణీ, సన్నబియ్యం సరఫరా, ఆర్టీసీ బస్సు సౌకర్యాల మెరుగుదలకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.




