Jagga Reddy: అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసే వాళ్లకు.. సజ్జనార్ లాంటి ఆఫీసరే కరెక్ట్!
అమ్మాయిలను ట్రాప్ చేసి, వారిని బ్లాక్ మెయిల్ చేసే క్రిమినల్స్ కు సజ్జనార్ లాంటి పోలీస్ ఆఫీసరే కరెక్టు.

* న్యాయస్థానాలు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.
* మహిళలను వేధించే వారికి పోలీసులున్నారనే భయం కలిగేలా చర్యలు ఉండాలి.
* ఇంటిదగ్గరే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తీసుకున్ననిర్ణయం అభినందనీయం.
* సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో ప్రభుత్వం, పోలీసులు తీసుకున్న భేషైన నిర్ణయమిది.
* బాధితురాళ్ల వివరాలు గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత పోలీసులదే.
* మీడియా సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.
కందిలి, సంగారెడ్డి
‘‘అమ్మాయిలను ట్రాప్ చేసి, వారిని బ్లాక్ మెయిల్ చేసే క్రిమినల్స్ కు సజ్జనార్ లాంటి పోలీస్ ఆఫీసరే కరెక్టు. న్యాయస్థానాలు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆడవారిని వేధించే వారికి పోలీసులున్నారనే భయం కలిగేలా కఠిన చర్యలుండాల’’ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గురువారం గాంధీభవన్ వేదికగా నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంటిదగ్గరే.. ఏఫ్ఐఆర్ నిర్ణయం భేష్!
‘‘మగవాళ్ల చేతిలో మోసపోయిన బాధితురాళ్లకు సంబంధించి ఇంటి దగ్గరే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఐడీ అధికారి చారు సిన్హా, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. అమ్మాయిల్ని ట్రాప్ చేసే క్రిమినల్స్ కు సజ్జానార్ చర్యలే కరెక్ట్. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. బాధిత అమ్మాయిల వివరాలు గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత పోలీసులదే’’నని జగ్గారెడ్డి సూచించారు.
ఇలాంటి కథనాలు… మీడియాలో చూపకండి!
‘‘సెక్స్ పరమైన వాటితో పాటు వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన కథనాలను ప్రింట్, ఎలక్ట్రానిక్, యూట్యూబ్, సోషల్ మీడియాల్లో ఇవ్వకండి. క్రైమ్ రిపోర్టర్ల దగ్గర సమాచారం ఉంటే, ఆవివరాలను పోలీసులకు అందించండి. కానీ ఆ సమాచారం బహిర్గతం చేయకండి. సమాచారం బయటకు వస్తే ప్రైవసీ దెబ్బతింటుంది. జీవితాలు బలయ్యే ప్రమాదం ఉంటుంది. నాయకులు, అధికారుల వ్యక్తిగత సంబంధాల వార్తలు వేయకుండా ఉండండి. అలా చూపించడం మంచి పద్ధతి కూడా కాద’’ని జగ్గారెడ్డి తెలిపారు. మీడియా వాళ్లు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాజకీయ నాయకుడిగా.. పోలీసులతో కొట్లాడుతా!
‘‘సైకోలు, బ్లాయిమెయిల్ చేసేవాళ్ల విషయంలో చట్టాలున్నాయి. న్యాయస్థానాలున్నాయి. వైఎస్ఆర్ హయాంలో ఒక అమ్మాయిని సతాయించిన వాళ్లను ఎన్కౌంటర్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఒక ఎన్కౌంటరు చేశారు. రాజ్యాంగపరంగా ఎన్కౌంటరును సమర్థించలేం. కానీ వ్యక్తిగతంగా సమర్థిస్తుంటారు. కొన్ని సార్లు అలాంటి భయం ఉండాలి. రాజకీయ నాయకుడిగా పోలీసులతో కొట్లాడతాను. ఇది పొలిటికల్ గేమ్. పోలీస్, పాలిటిక్స్ ఎప్పుడూ ఉండేదే’’నని జగ్గారెడ్డి వివరించారు.



