Sangareddy: విద్యారంగానికి నిధుల కోతపై పీడీఎస్యూ ఆగ్రహం.. కేంద్ర బడ్జెట్ పత్రాల దహనం
2026-27 కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి తగిన నిధులు కేటాయించకపోవడం పట్ల ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

సంగారెడ్డి: 2026-27 కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి తగిన నిధులు కేటాయించకపోవడం పట్ల ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బడ్జెట్ పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం జీడీపీలో 6 శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా, ప్రస్తుత బడ్జెట్లో కేవలం రూ.1.39 లక్షల కోట్లు (2.6 శాతం) మాత్రమే కేటాయించడం దారుణమన్నారు.
ఈ కేటాయింపుల వల్ల ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ఉపాధ్యాయ నియామకాలు మరియు విద్యార్థుల స్కాలర్షిప్లపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల కొరత వల్ల పేద, దళిత, వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అనిల్, జెస్సికా, దుర్గాప్రసాద్, పావని తదితరులు పాల్గొన్నారు.



