Sangareddy: మార్చి 31లోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలి – అధికారులకు వీ.పీ.గౌతమ్ ఆదేశం
జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హౌసింగ్ సెక్రెటరీ, ఎం.డీ వీ.పీ.గౌతమ్ ఆదేశించారు

సంగారెడ్డి: జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హౌసింగ్ సెక్రెటరీ, ఎం.డీ వీ.పీ.గౌతమ్ ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లాలోని సదాశివపేట, కోహిర్, జహీరాబాద్ మండలాల్లో పర్యటించి నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో 12,479 ఇళ్లు మంజూరు కాగా, ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. బిల్లుల చెల్లింపులో ఎలాంటి ఆలస్యం లేదని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రూ. 1 లక్ష వరకు రుణాలు అందిస్తున్నామని వివరించారు. ముఖ్యంగా రూఫ్ లెవల్లో ఉన్న 4,000 ఇళ్లను మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా విధించారు. అలాగే, పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మరో రెండు నెలల్లో లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఏజెన్సీలను ఆదేశించారు.



