Sangareddy: అభ్యర్థులను గెలిపించండి.. వార్డులను నేనే అభివృద్ధి చేస్తా – జగ్గారెడ్డి పిలుపు
సంగారెడ్డి మున్సిపాలిటీలోని మొత్తం 38 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని, పట్టణ అభివృద్ధి బాధ్యతను తాను భుజానికెత్తుకుంటానని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీలోని మొత్తం 38 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని, పట్టణ అభివృద్ధి బాధ్యతను తాను భుజానికెత్తుకుంటానని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం రామ్నగర్లోని తన నివాసంలో అభ్యర్థులు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపే ఏకైక లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని సూచించారు. అభ్యర్థులు విజయం సాధించిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ప్రత్యేక నిధులు మంజూరు చేయించి, అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వార్డుల వారీగా సమస్యలను నేరుగా పర్యవేక్షించి పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.
రామ్నగర్ వార్డులో శ్రీకాంత్ గౌడ్ గెలుపునకు సహకరించాలని, శివుడికి, అమెర్ బేగ్కు భవిష్యత్తులో కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. 38 వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఆయనను కలిసేందుకు తరలివచ్చారు.



