Congress: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి – నీలం మధు ముదిరాజ్ పిలుపు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు

జుక్కల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావులతో కలిసి సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు మున్సిపల్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ, సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుందని, అదే ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ప్రతి మున్సిపాలిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 15 కోట్ల ప్రత్యేక నిధులను కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికలు ముగియగానే ఈ నిధులతో మౌలిక వసతులు కల్పించి, ప్రతి వాడను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.



