Nirmala Jaggareddy: కరెన్సీపై గాంధీ బొమ్మ తొలగింపు కుట్రలను తిప్పికొట్టాలి: నిర్మలా జగ్గారెడ్డి
దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేయని వారే కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మను తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని, అటువంటి ప్రయత్నాలను అందరూ ఏకమై తిప్పికొట్టాలని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.

- సంగారెడ్డిలో ముగిసిన ఆదివాసీ కార్యకర్తల శిక్షణ శిబిరం..
- హాజరైన ఎంపీ సురేష్ శెట్కార్, నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి: దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేయని వారే కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మను తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని, అటువంటి ప్రయత్నాలను అందరూ ఏకమై తిప్పికొట్టాలని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో మూడు రోజుల పాటు జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా ఆదివాసీ కార్యకర్తల శిక్షణ శిబిరం సోమవారంతో ఘనంగా ముగిసింది.
ఆదివాసీల హక్కుల కోసం సమరశీలి శిక్షణ
రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో ఆదివాసీల హక్కులు, సంక్షేమ పథకాలపై ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ముగింపు సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీ సురేష్ శెట్కార్, నిర్మలా జగ్గారెడ్డి కార్యకర్తలకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘స్థానిక ప్రజల కోరిక మేరకు నారాయణఖేడ్ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఇతర పార్టీలు కేవలం మాటలకే పరిమితమవుతాయని, కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు. ఈ శిక్షణలో నేర్చుకున్న విషయాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి’అని పేర్కొన్నారు.
కేంద్రం చర్యలపై ఎంపీ సురేష్ శెట్కార్ ధ్వజం
అనంతరం ఎంపీ సురేష్ శెట్కార్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని మండిపడ్డారు.
కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పార్లమెంట్ వేదికగా పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. పేదలకు ఉపాధి కల్పించకుండా వారిని మరింత ఇబ్బందులకు గురిచేసేలా కేంద్ర కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



