Crime News: చైనా మాంజా ప్రాణం తీసింది.. సంగారెడ్డిలో బైక్పై వెళ్తున్న కార్మికుడి మెడకు తగిలి మృతి
నిషేధిత చైనా మాంజా మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. సంగారెడ్డి జిల్లాలోని ఫసల్వాదీ గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంగారెడ్డి: నిషేధిత చైనా మాంజా మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. సంగారెడ్డి జిల్లాలోని ఫసల్వాదీ గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. బైక్పై వెళ్తుండగా అకస్మాత్తుగా చైనా మాంజా మెడకు చుట్టుకోవడంతో అన్వేష్ కుమార్(35) అనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపుర్ ఖేరీకి చెందిన కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
సంఘటన వివరాలు..
బుధవారం ఉదయమే యూపీ నుంచి తన కుటుంబంతో అతను సంగారెడ్డికి చేరుకున్నాడు. కాగా.. పని నిమిత్తం బైక్పై వెళ్తున్న బాధితుడి మెడకు గాలిలో ఎగురుతున్న చైనా మాంజా బలంగా తగిలింది. దారానికి ఉన్న పదును వల్ల మెడ లోతుగా తెగిపోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. చికిత్స అందే లోపు ఘటనా స్థలంలోనే ఆ కార్మికుడు ప్రాణాలు వదిలాడు. చైనా మాంజా ఎంతటి ప్రాణాంతకమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.
నిషేధం ఉన్నా ఆగని విక్రయాలు..
చైనా మాంజా వాడకం, విక్రయాలపై ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా, ప్రచారాలు నిర్వహిస్తున్నా మార్కెట్లో వీటి అమ్మకాలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతూనే ఉన్నాయి. కేవలం వినోదం కోసం వాడే ఈ దారాలు అమాయక ప్రాణాలను, పక్షులను బలితీసుకుంటున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తనిఖీలు మరింత ముమ్మరం చేసి, ఇలాంటి ప్రాణాంతక మాంజాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.



